ఏపీలో 'పెద్ది' అదనపు షోలు.. ప్రీమియర్ షో టికెట్ ధర ఎంతంటే?

  • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి ఏపీ సర్కార్ ప్రత్యేక అనుమతులు
  • టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • జూన్ 3న స్పెషల్ ప్రీమియర్ షోలకు అవకాశం
  • ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 600గా నిర్ణయం
  • విడుదలైన వారం రోజుల పాటు రోజుకు 5 షోలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చిత్ర బృందానికి, పంపిణీదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి, ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి అనుమతినిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం జూన్ 4న సినిమా విడుదల కానుండగా, ఒకరోజు ముందే అంటే జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'పెద్ది' స్పెషల్ ప్రీమియర్ షోలను ప్రదర్శించుకోవచ్చు. ఈ ప్రత్యేక షోల కోసం టికెట్ ధరను జీఎస్‌టీతో కలిపి గరిష్ఠంగా రూ. 600గా ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఇటీవల కొన్ని భారీ చిత్రాల ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు వెయ్యి రూపాయలకు పైగా పలికిన తరుణంలో 'పెద్ది'కి రూ. 600 ధరను నిర్ణయించడంపై అభిమానులు, సామాన్య ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక, సినిమా విడుదలైన తొలి వారం రోజుల పాటు (జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు) టికెట్ల ధరలు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో పాటు ఇదే కాలానికి థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఐదు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలవుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో ఏపీలో 'పెద్ది' సినిమాకు తొలి వారం భారీ స్థాయిలో వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Peddi Movie
Ram Charan
Buchi Babu Sana
Uppena
AP Government
Movie Ticket Prices
Special Shows
Kumar Vishwajeet
Telugu Cinema
Pan India Movie

More Telugu News